ముందుమాట
సి.బి.ఎస్.ఇ సిలబస్ ద్వారా పదవ తరగతి తెలుగు ద్వితీయభాషగా చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు సరైన స్టడీ మెటీరియల్ లేదు. ఆ లోటును తీర్చడానికి దీనిని తయారుచేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన సామెతలు, జాతీయాలు, వ్యాసాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా కూర్చబడ్డాయి. అంతేకాకుండా సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, అపరిచిత గద్యాలు మొదలైన వాటికి బహుళైచ్చిక ప్రశ్నలతో అభ్యసన పత్రాలు కూడా ఇవ్వబడ్డాయి. అందువల్ల ఇందులోని విషయం తేలికగా అర్థంచేసుకొని పరీక్షలలో మంచిమార్కులతో ఉత్తీర్ణులవడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది. కాబట్టి దీనిద్వారా విద్యార్థులు తెలుగులో మంచి మార్కులతో ఉత్తీర్ణులౌతారని ఆశిస్తూ-
మీ
రచయిత..
SA-1
విషయసూచిక
పద్యభాగం
1. మాతృవేదన
2. ప్రవరుని స్వగతం
గద్యభాగం
1. బొండుమల్లెలు
2. అంపకాలు
3. చేనేత దృక్పథం
ఉపవాచకం
బారిష్టరు పార్వతీశం 1-34 పేజీలు
వ్యాకరణం
1. చందస్సు (ఉత్పలమాల,చంపకమాల)
2. సమాసాలు (ద్వంద్వ, ద్విగు,బహువ్రీహి,రూపక)
3. సంధులు (ఆమ్రేడిత, పుంప్వాదేశ, పడ్వాది)
4. సామెతలు-అర్థాలు
5. జాతీయాలు-వాక్యప్రయోగాలు
6. అపరిచిత గద్యాలు
7. లేఖారచన పద్ధతులు
8. వ్యాసరచన
పద్యభాగం
1. మాతృవేదన
ప్రశ్నలు - జవాబులు :
1. జరిత దు:ఖానికి కారణం ఏమిటి?
జ. మందపాలుని భార్య జరిత. ఆమె ఒక లావుక పక్షి. వారికి జరితారి, సారిసృక్కు, అస్తంభమిత్రుడు, ద్రోణుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు. అగ్ని ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు. వేగంగా వస్తున్న మంటలను చూసిజారిత వీళ్ళని ఎటూ తీసుకొని వెళ్ళలేనని, తండ్రిలా నిర్దయగా విడిచి వెళ్ళలేనని, విధిరాతను ఎవరూ తప్పించుకోలేరని బాధపడింది.
2. జరిత తన పిల్లల్ని ఎలా రక్షించాలనుకుంది? (లేక) జారిత తన పిల్లలతో ఏమంది?
జ. వేగంగా సమీపిస్తున్న మంటలను చూసి, జారిత తనపిల్లలను అక్కడున్న కన్నంలోకి పోయి దాక్కోమంది. ఆ మంటలు వారికి తగలకుండా అ కన్నాన్ని గట్టి దుమ్ము, ధూళితో కప్పుతానంది.
3. జరితారి బిలంలోకి ప్రవేశించడానికి ఎందుకు నిరాకరించాడు?
జ. తల్లిమాటలు విన్న జరితారి కన్నంలోకి పోతే, అక్కడ ఎలుక చంపుతుందని, ఇక్కడే ఉంటే అగ్ని దాహిస్తాడని, ఎలుక చేతిలో మరణించడం కంటె మంటల్లో కాలి పుణ్యలోకాలు పొందవచ్చని ఆమెతో అన్నాడు. కన్నంలోకి వెళ్తే ఎలుకవల్ల మరణించడం తథ్యమని, ఇక్కడే ఉంటే గాలివల్ల మంటలు తొలగిపోవచ్చని చెప్పాడు. కష్టసమయంలో అనుమానంగా ఉన్న పనే చెయ్యాలి కాని, జరిగితీరుతుందన్న పని చేయకూడదని, అందువల్ల తాము ఆ కన్నంలోకి వెళ్ళలేమని అన్నాడు.
4. పక్షిపిల్లలకు అగ్నిభయం ఏవిధంగా తొలగిపోయింది?
జ. తల్లిమాటలు విన్న ఆమె పెద్దకొడుకు తాము కన్నంలోకి వెళ్ళలేమని, నువ్వు బతికుంటే మళ్ళీ సంతానాన్ని పొందవచ్చని, నీపుణ్యంవల్ల మేము జీవించి ఉంటే, నువ్వు మాదగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడవచ్చని, కాబట్టి దయచేసి ఇక్కడినుండి వెళ్ళిపొమ్మని ఆమెను ప్రార్థించాడు.
5. పక్షిపిల్లలకు అగ్నిభయం ఎలా తొలగిపోయింది?
జ. పక్షిపిల్లలు నలుగురూ నాలుగు వేదమంత్రాలతో అగ్నిని ప్రార్థిస్తూ శరణు వేడారు. అగ్ని మందపాలుని ప్రార్థనను గుర్తుకు తెచ్చుకొని వారున్న చెట్టును విడిచిపెట్టాడు. ఈవిధంగా వారికి అగ్నిభయం తొలగిపోయింది.
అర్థసందర్భ వాక్యాలు :
1. విధికృతము గడవనేరగా లావే?
కవిపరిచయం : ఈవాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం నుండి గ్రహింపబడిన మాతృవేదన అనే పద్యభాగం లోనిది.
సందర్భం : అగ్ని ఖాండవవనాన్ని దహిస్తూ ఉండగా తన పిల్లల్ని ఏవిధంగా రక్షించుకోవాలో తెలియక జారిత బాధపడుతూ అనుకున్న సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : ఇంకా రెక్కలైనా రాణి వీరిని నేను ఎక్కడికీ తీసుకొని వెళ్ళలేను. తండ్రిలా నిర్దయగా వీరిని వదలి వెళ్ళలేను. దైవనిర్ణయం ఎలా ఉందో? దానిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యంకాదు కదా! అని జారిత బాధపడిందని భావం.
2. దీని గప్పెడ ఘనపాంశుజాలముల భీమశిఖావళి దాకాకుండగన్.
కవిపరిచయం : ఈవాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం నుండి గ్రహింపబడిన మాతృవేదన అనే పద్యభాగం లోనిది.
సందర్భం : అగ్ని ఖాండవవనాన్ని దహిస్తూ ఉండగా తనపిల్లలను రక్షించుకోవడం కోసం వారిని అక్కడ ఉన్న కన్నంలోకి వెళ్ళమని జారిత వారికి తెలిపే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : ఈ అగ్ని ప్రళయాగ్నిలా సమీపిస్తోంది. కాబట్టి మీరు ఈకన్నంలోకి వెళ్లి దాక్కుంటే, మీకు మంటలు తగలకుండా నేను దీనిని గట్టి దుమ్ము, ధూళితో కప్పివేస్తానని జరిత తన పిల్లలతో చెప్పిందని భావం.
3. ఎలుకతో చచ్చుకంటె నీ జ్వలనశిఖల గ్రాగి పుణ్యలోకంబుల గాంతు మేము.
కవిపరిచయం : ఈవాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం నుండి గ్రహింపబడిన మాతృ వేదన అనే పద్యభాగం లోనిది.
సందర్భం : జరిత మాటలు విన్న ఆమె పెద్దకొడుకు జరితారి ఆమెకు బదులుపలికే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : 'అమ్మా! మేము ఆ కన్నంలోకి వెళ్తే, అందులో ఉన్న ఎలుక మమ్మల్ని చంపుతుంది. ఇక్కడే ఉంటే అగ్ని దహిస్తుంది. కాబట్టి ఎలుకవల్ల చచ్చే కంటే, ఈ అగ్నివల్ల మరణిస్తే పుణ్యలోకాలైనా పొందుతాము. కాబట్టి మేము నువ్వు చెప్పినట్లుగా చేయలేము.' అని జరితారి తల్లికి బదులిచ్చాడని భావం.
4. కృచ్చ్రంబుల సంశయయుత కార్యంబులు కర్తవ్యములు.
కవిపరిచయం : ఈవాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం నుండి గ్రహింపబడిన మాతృ వేదన అనే పద్యభాగం లోనిది.
సందర్భం : తల్లిమాటలు విని, కష్టసమయంలో ఎలాంటి పనులు చేయాలో ఆమెకు జరితారి వివరించి చెప్పే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : 'మేము కన్నంలోకి వెళ్తే ఎలుకల వల్ల చనిపోవడం నిజం. ఇక్కడే ఉంటే, గాలివల్ల అగ్ని తొలగిపోయి మేము బ్రతుకవచ్చు. కాబట్టి ఇలాంటి కష్టసమయంలో జరుగుతుందో, జరగదో అన్న అనుమానమున్న పనే చెయ్యాలి. కాని జరుగుతుందన్న పని చేయకూడదు.' అని జరితారి తనతల్లికి చెప్పాడని భావం.
5. మేము దహనక్లేశంబునం బొందినను నీవు జీవించి పుత్త్రులం బడయనోపుదువు.
కవిపరిచయం : ఈవాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం నుండి గ్రహింపబడిన మాతృ వేదన అనే పద్యభాగం లోనిది.
సందర్భం : జరితమాటలు విని, ఆమె పెద్దకొడుకైన జరితారి ఆమెకు సమాధాన మిచ్చే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : 'అమ్మా! నువ్వు బ్రతికి ఉంటే, మళ్ళీ కొడుకులను పోమ్దవచ్చు. నీ అదృష్టంవల్ల మేము బ్రతికి ఉంటే, మమ్మల్ని రక్షించుకోవచ్చును . కాబట్టి మామీద మొహం వదలి నువ్వు దూరంగా వెళ్ళిపో!' అని జరితారి తల్లితో చెప్పాడని భావం.
6. అలఘులు మాకభయమభయ మనిరయ్యనలున్
కవిపరిచయం : ఈవాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం నుండి గ్రహింపబడిన మాతృ వేదన అనే పద్యభాగం లోనిది.
సందర్భం : జరితయొక్క నలుగురు కొడుకులు అగ్నిని ఏవిధంగా ప్రార్థించారో కవి తెలియజేసే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : జరితయొక్క నలుగురు కొడుకులు బ్రహ్మదేవుని నాలుగుముఖాల వలె వేదమంత్రాలతో అగ్నిని ప్రార్థించారని భావం.
== == == == ==
ప్రవరుని స్వగతం
- అల్లసాని పెద్దన
ప్రతిపదార్థాలు :
పద్యం 1 : అట జని కాంచె భూమిసురు డంబరచుంబి శిరస్సర ఝ్జరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ మృదంగ తరంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్.
భావం : ప్రవరుడు హిమాలయ పర్వతాలకు చేరుకొని, ఆ పర్వతశిఖరాల నుండి నిరంతరం ప్రవహించే సెలయేళ్లలోని అలలు అనే మృదంగ ధ్వనులకు అనుకూలంగా పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్ళను, అక్కడి లోయల్లో తిరిగే ఆడు ఏనుగుల తుండాలతో కదల్చబడిన చెట్లను చూశాడు.
పద్యం 2 : తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వం బెన్న నేనియ్యెడన్
గల చోద్యంబులు రేపు గన్గొనియెదన్ గాకేమి నేడేగెదన్
నళినీబాంధవ భానుతప్త రవికాంత స్యంది నీహార కం
దళ చూత్కార పరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నమున్ దెల్పెడిన్.
అర్థాలు :
ఈ నగమహత్వంబున్ = ఈ పర్వతం యొక్క గొప్పతనాన్ని
ఎన్నన్ = చెప్పుటకు
బ్రహ్మకున్+ఐనన్ = బ్రహ్మదేవునికైనా
తలము+ఏ = సాధ్యమా?
నలినీబాంధవ = సూర్యుని యొక్క
భాను = కిరణాలచేత
తప్త = వేడెక్కబడిన
రవికాంత = సూర్యకాంత మణులమీద
స్యంది = పడుతున్న
నీహారకందళ = మంచుబొట్ల వల్ల కలిగే
చూత్కార పరంపరల్ = చుయ్ చుయ్ మనే శబ్దాలు
పయిపయిన్ = పైపైన
మధ్య+ఆహ్నమున్ = మధ్యాహ్న సమయాన్ని
తెల్పెడిన్ = తెలుపుతున్నాయి.
నేను = నేను
ఈ+ఎడన్+కల = ఇక్కడ ఉన్న
చోద్యంబులు = వింతలను
రేపు = రేపు
కన్గొనియెదన్+కాక = చూచెదను లెమ్ము
ఏమి = దానికేమి?
నేడు = ఈనాటికి
ఏగెదన్ = తిరిగి వెళ్తాను.
భావం : ఈపర్వతం యొక్క గొప్పతనాన్ని వర్ణించడం బ్రహ్మదేవునికైనా శక్యం కాదు. సూర్యకిరణాల వేడికి కరిగిన మంచుబొట్లు వేడెక్కిన సుర్యకాంత మణులమీద పది చేస్తున్న చుయ్ చుయ్ అనే శబ్దాలు మధ్యాహ్నం అయినట్లు తెలియజేస్తున్నాయి. ఈరోజుకు వెళ్ళిపోయి రేపు తిరిగి వచ్చి ఇక్కడి వింతలను చూస్తాను.
సారాంశం :
అరుణాస్పదపురంలో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అతిథిసత్కారాలు, తీర్థయాత్రలు అంటే చాల ఇష్టం. ఒకసారి పిన్నవయస్సులోనే అనేక దేశాలు తిరిగి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరుని వద్దకు వచ్చాడు. ఇంత చిన్నవయసులోనే అన్ని దేశాలు ఎలా తిరిగి చూడగలిగావని ప్రవరుడు అతనిని అడిగాడు. తనవద్ద ఉన్న పసరు సహాయంతో అనేక దేశాలు తిరిగి రాగలిగానని చెప్పి, ప్రవరుని పాదాలకు కొంత పసరు పూసి, వెళ్ళిపోయాడు. దాని సహాయంతో అతడు హిమాలయ పర్వతాలను చూడడానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్లి, ఆకాశాన్నంటే పర్వతశిఖరాల నుండి ప్రవహించే సెలయేళ్ల అలల చప్పుళ్ళకు పురివిప్పి నాట్యమాడే నెమళ్ళను, అక్కడి లోయలలో తిరిగే ఆడు ఏనుగుల తుండాలతో కదల్చబడిన మద్దిచెట్లను చూశాడు. ఆ పర్వతం యొక్క గొప్పతనాన్ని వర్ణించడం బ్రహ్మదేవునికి కూడ సాధ్యం కాదనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైనట్లు గ్రహించి ఇంటిముఖం పట్టాడు. కాని, మంచునీటికి అతని పాదలేపనం కరిగిపోయి, వెళ్ళలేకపోయాడు.
ఆసంగతి తెలిసి 'ఓ భగవంతుడా! సిద్ధుడనే వంకతో నన్నుఈ భయంకరమైన అరణ్యానికి తీసుకొని వచ్చావా?' అని బాధపడి, 'అరుణాస్పదపురం ఎక్కడ? ఈ హిమాలయపర్వతం ఎక్కడ? నేను ఈవిధంగా రావచ్చునా? ఇంతకు ముందు వచ్చిన దారి కూడ నాకు తెలియదు. ఇక్కడి నందు బయటపడే మార్గమేమిటో కదా? ఒకనిమిషం కనబడకపోతే ఊరంతా వెతికే నా తండ్రి ఎంత బాధపదతాడో కదా? ఎల్లవేళల ఇల్లు వదలి వెళ్ళకుండా కాపాడే నాతల్లి ఎంత బాధపడుతుందో? నాకు అనుకూలంగా మసలుకొనే నా భార్య ఎంతగా బాధపడుతుందో? ఎప్పుడూ నాకు తోడునీడగా ఉండే నాశిష్యులు ఎంత బాధపడతారో కదా? అతిథిసత్కారాలు ఏమైపోయాయో? అగ్నికార్యాలు ఏమయ్యాయో? ఓ దైవమా! ప్రతిరోజూ జరిగే పనులు జరుగకుండా కోపంతో నన్ను ఈవిధంగా ఆకాశం విరిగి మీదపడే చోటుకు తీసుకొని వచ్చి పడేశావా?' అని మనసులో తలపోశాడు.
ప్రశ్నలు - జవాబులు :
1. హిమాలయాన్ని కవి ఏవిధంగా వర్ణించాడు?
జ. హిమాలయ పర్వతశిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడినుండి సెలయేళ్ళు క్రిందికి జారిపడుతున్నాయి. వాటి అలల నుండి వచ్చే శబ్దం మృదంగ ధ్వనిలా ఉంది. అక్కడ తిరిగే నెమల్లు పురివిప్పి, ఆధ్వనికి అనుకూలంగా నాట్యం చేస్తున్నాయి. ఆ లోయలలో తిరుగుతున్న ఆడు ఏనుగులు తమ తుండాలతో అక్కడి చెట్లను కదల్చివేస్తున్నాయి. అని కవి హిమాలయాన్ని చక్కగా వర్ణించాడు.
2. మధ్యాహ్న సమయ మైనట్లు ప్రవరుడు ఎలా తెలుసుకున్నాడు?
జ. సూర్యకిరణాలు పడి వేడెక్కిన సుర్యకాంత మణుల మీద కరిగిన మంచుబిందువులు పడి చుయ్ చుయ్ మని చప్పుళ్ళు చేయడంతో అతడు మధ్యాహ్న మైనట్లు తెలుసుకున్నాడు.
3. ప్రవరుని చింతాకు కారణం ఏమిటి?
జ. ప్రవరుడు హిమాలయాల అందానికి ముగ్ధుడై మధ్యాహ్నమైనట్లు తెలుసుకొని మళ్ళీ రేపు వచ్చి, ఇక్కడి వింతలను చూస్తాను. ఇక ఈరోజుకు వెళ్తాననుకొని తిరిగి ఇంటికి పోవడానికి సిద్ధపడి వెళ్ళలేకపోయాడు. పాదలేపనం కరిగిపోయిన సంగతి తెలుసుకొని 'భగవంతుడా! సిద్ధుడనే వంకతో నన్ను ఈ భయంకరమైన అరణ్య ప్రాంతానికి తీసుకొని వచ్చావా? అరుణాస్పద పురమెక్కడ? తిరిగి పోదామంటే, ఇంతకు ముందు వచ్చిన దారి కూడా తెలియదు. ఇక్కడి నుండి బయటపడే మార్గమేమిటో కదా?' అని బాధపడ్డాడు.
4. తనగురించి ఎవరెవరు ఎలా బాధపడతారో నని ప్రవరు డనుకున్నాడు?
జ. పాదలేపనం కరిగిపోయిన సంగతి తెలుసుకున్న ప్రవరుడు 'ఒక్కనిమిషం కనబడకపోయే ఊరంతా వెతికే నాతండ్రి ఎంత బాధపడతాడో కదా? ఎల్లవేళలా ఇల్లు వదలి వెళ్ళకుండా కాపాడే నాతల్లి ఎంత బాధపడుతుందో? నాకు అనుకూలంగా మసలుకొనే నాభార్య ఎంతగా బాధపడుతుందో? నాకు తోడునీడగా ఉండే నా శిష్యులు ఎంత బాధపడతారో కదా? అతిథిసత్కారాలు ఏమైపోయాయో? అగ్నికార్యాలు ఏమయ్యాయో?' అని అనుకున్నాడు.
అర్థసందర్భ వాక్యాలు :
1. నీహారకందళ చూత్కార పరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నమున్ దెల్పెడిన్.
కవిపరిచయం : ఈవాక్యం అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలోని ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రవరుని స్వగతం అనే పద్యభాగం నుండి తీసుకోబడింది .
సందర్భం : ప్రవరుడు హిమాలయాల అందాన్ని చూసి తిరిగి ఇంటికి వెళ్ళాలనుకొనే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : సూర్యకిరణాల వేడికి కరిగిన మంచుబిందువులు సుర్యకాంత మణులమీద పడి చేస్తున్న చుయ్ చుయ్ మనే శబ్దాలు మధ్యాహ్నమైనట్లుగా తెలియజేస్తున్నాయని భావం.
2. దైవకృతమున కిల నసాధ్యంబు గలదె?
కవిపరిచయం : ఈవాక్యం అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలోని ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రవరుని స్వగతం అనే పద్యభాగం నుండి తీసుకోబడింది .
సందర్భం : ప్రవరుని పాదాలకున్న లేపనం కరిగిపోయిందని కవి తెలియజేసే సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : మధ్యాహ్న మయిందని తెలుసుకున్న ప్రవరుడు హిమాలయాలలోని మిగిలిన వింతలను మళ్ళీ వచ్చి చూడవచ్చని తిరిగి పోబోగా అతని పాదలేపనం కరిగిపోయి వెళ్ళలేకపోయాడు. భగవంతుడు చేయదలుచుకున్న దానికి అసాధ్యమైనది ఏదీ ఉండదని భావం.
3. హా! నన్నిట్లు దైవంబ తెచ్చితె ఈ ఘోరవనప్రదేశమునకున్ సిద్ధ్హాపదేశంబునన్.
కవిపరిచయం : ఈవాక్యం అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలోని ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రవరుని స్వగతం అనే పద్యభాగం నుండి తీసుకోబడింది .
సందర్భం : పాదలేపనం కరిగిపోయిన సంగతి తెలుసుకొన్న ప్రవరుడు దిక్కుతోచక బాధతో తనలో తాను అనుకున్న స్సందర్భంలోనిడ్ ఈవాక్యం.
భావం : తనపట్టణానికి తిరిగి వెళ్ళాలనుకున్న ప్రవరుడు పాదలేపనం కరిగిపోయిన సంగతి తెలుసుకొని 'ఓ భగవంతుడా! సిద్ధుడనే వంకతో నన్ను ఈ భయంకరమైన అరణ్యానికి తీసుకొని వచ్చావా?' అని తనలో తాను అనుకున్నాడని భావం.
4. మును సనుదెంచిన దిక్కిదియని యెరుగ వెడలు తెరువెయ్యదియో?
కవిపరిచయం : ఈవాక్యం అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలోని ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడిన ప్రవరుని స్వగతం అనే పద్యభాగం నుండి తీసుకోబడింది .
సందర్భం : పాదలేపనం కరిగిపోయిన సంగతి తెలుసుకొన్న ప్రవరుడు దిక్కు తోచక బాధతో తనలో తాను అనుకున్న సందర్భంలోనిది ఈవాక్యం.
భావం : 'అరుణాస్పదపుర మెక్కడ? ఈ హిమాలయ పర్వతం ఎక్కడ? పొగరెక్కి నేను ఈవిధంగా రావడం ఎందుకు? తిరిగి పోదామంటే వచ్చిన దారికూడ తెలియదుకదా!' అని ప్రవరుడు తనలోతాను అనుకొని బాధపడ్డాడని భావం.
No comments:
Post a Comment